Gannavaram: మహిళా వాలంటీర్ పెళ్లి.. పెళ్లికొడుక్కి డిజిటల్ అసిస్టెంట్ వార్నింగ్.. సీన్ కట్ చేస్తే!

Gannavaram: వధువు మహిళా వాలంటీర్.. ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఇంట పెళ్లి సందడి నెలకొంది. తెల్లారి పెళ్లి అనగా బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంది. కానీ, ఇంతలోనే పిడుగులాంటి వార్త వధువు ఇంటికి చేరింది. తమకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడి కుటుంబం నుంచి రాయబారం వచ్చింది. ఆశ్చర్యపోయిన వధువు సహా కుటుంబ సభ్యులు ఎందుకిలా చేశారని వరుడి కుటుంబాన్ని నిలదీశారు.
వధువు పనిచేసే సచివాలయంలోని ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణమని తెలుసుకున్న వధువు బంధువులు.. పెళ్లి ఆగిపోవడానికి కారణమైన యువకుడిని పట్టుకుని చెప్పులు, చీపుర్లతో దేహశుద్ధి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిందీ ఘటన. గన్నవరం సచివాలయం-3లో ఈడ్పుగంటి రాంబాబు గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అదే సచివాలయ పరిధిలో ఓ యువతి గ్రామా వాలంటీర్ గా పనిచేస్తుంది.
కాగా, వాలంటీరుగా పనిచేస్తున్న యువతికి ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం చొప్పరమెట్లకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈనెల 22న పెళ్లి జరగాల్సి ఉండగా.. పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లికొడుకును వెతుక్కుంటూ వెళ్లిన సచివాలయ ఉద్యోగి రాంబాబు.. పెళ్లి కూతురు, తాను ప్రేమించుకున్నామని.. ఇప్పుడు అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నా.. జీవితాంతం ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వరుడి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.
అయితే.. ముందుగా పెళ్ళికి ఒప్పుకొని తెల్లారి పెళ్లి అనగా ఎందుకు రద్దు చేసుకున్నారని వధువు తరపు వారు ఆరాలు తీయడంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులలో మహిళలు.. శనివారం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రాంబాబును పట్టుకుని చీపుర్లు, చెప్పులతో చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.