TDP-YSRCP: టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్ ఆహ్వానం.. వైసీపీ మూకుమ్మడి దాడి!

TDP-YSRCP: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ పాదయాత్రలో భాగంగా ఒక చోట మీడియా సమావేశం నిర్వహించగా.. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లోకేష్ తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరితో పాటు మంచి మనసు కలిగిన వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.
దీనిపై అప్పటి నుండే వైసీపీ మూకుమ్మడి దాడి మొదలు పెట్టింది. అసలు ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించేందుకు లోకేష్ కున్న అర్హత ఏంటని వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే కొడాలి నానీ, గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు నేతలు లోకేష్, చంద్రబాబులపై తీవ్రంగా విమర్శలు చేయగా తాజాగా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మంత్రి రోజా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
జూ.ఎన్టీఆర్ని లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం అతిపెద్ద జోక్ అన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీని స్థాపించింది జూనియర్ తాత సీనియర్ ఎన్టీఆర్ అని.. లోకేష్ తాత ఖర్జూరపు నాయుడు కాదన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జూ.ఎన్టీఆర్ని లోకేష్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని వంశీ చురకలు అంటించారు. ఇక, చంద్రబాబు.. బాలయ్య సినిమాలు చూసి.. ఆ డైలాగులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.
టీడీపీ ఎన్టీఆర్ది.. అందుకే చంద్రబాబు, లోకేష్ దొంగల్లా బతుకుతున్నారని మంత్రి రోజా చురకలు అంటించారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉందని.. లోకేష్ తన స్ధాయికి మించి మాట్లాడుతూన్నాడని ఆగ్రహించారు. ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడని.. లోకేష్ కూడా అదే కావాలని కోరుకుంటున్నట్లు ఉందని విమర్శలు చేశారు. ఒక్కసారి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరగగలడా అని రాజా సవాల్ విసిరారు.