Bus Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన రెండు ఆర్టీసీ బస్సులు!

Bus Fire Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం అయ్యాయి. మండలంలోని గంపులగ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సులలో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వెన్నెల బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. దీంతో బస్సు సిబ్బంది వేరే బస్సు రప్పించి ప్రయాణికులను పంపించారు. అయితే నిలిచిపోయిన బస్సును రిపేర్ చేయడానికి సిబ్బంది మరో బస్సులో వచ్చారు. ఈ క్రమంలో ఆగిపోయిన బస్సుకు మరో బస్సు బ్యాటరీతో వైర్లు అమర్చి చెకింగ్ చేస్తుండగా ఆగిపోయిన బస్సు బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నిమిషాలలోనే ఆగిపోయిన బస్సుకు మంటలు వ్యాపించి మాటల్లో దగ్ధమవగా.. అవి ఒక బస్సు నుంచి మరో బస్సుకు వేగంగా అంటుకున్నాయి. ఆగిపోయిన బస్సుకు మంటలు వ్యాపించడంతో సిబ్బంది దూరంగా వచ్చేశారు. దీంతో బస్సులు రెండూ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఒక బస్సుకు మంటలు వ్యాపించిన సమయంలో మరో బస్సును దూరం చేసినా మరో బస్సుకు మంటలు వ్యాపించకుండా నివారించగలిగేది. కానీ.. ఇక్కడ అది సాధ్యం కాలేదు. దీంతో రెండూ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.