Road Accident: డివైడర్ ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం!

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 08:54 AM

Road Accident: డివైడర్ ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం!

Road Accident: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు భారీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రమాదాలకు బ్రేక్ పడడం లేదు. ప్రైవేట్ వాహనాలే కాదు ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొన్న ఆ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

బస్సు డివైడర్ ఎక్కే సమయంలో వేగం తక్కువగా ఉండడంతో బోల్తా పడిన వెంటనే ఆగిపోయింది. అదే వేగం ఎక్కువగా ఉంటే పల్టీలు కొట్టేది. అప్పుడు ఊహించని విధంగా నష్టం జరిగేది. అదృష్టవశాత్తు తక్కువ వేగం ఉండడంతో ప్రాణ నష్టం లేకుండా అందరూ బయటపడ్డారు. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిద్ర మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్క సారిగా బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టి రోడ్డుపై పడిపోయింది.

బస్సు బోల్తా పడిన సమయంలో అందులోని ప్రయాణికులు కూడా అంతా నిద్ర మత్తులో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉండగా ఎవరికీ ఎటువంటి ప్రాణప్రాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగినా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు, ప్రయాణికుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.