Tirupati Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి భక్తుల దుర్మరణం!
Tirupati Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన శ్రీవారి భక్తులుగా గుర్తించారు.
తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారులో 9 మంది భక్తులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా ప్రాధమిక అంచనాగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.