Nara Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి!

Nara Lokesh Padayatra: టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పాదయాత్ర 14వ రోజున అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే, పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అతడిని హుటాహుటీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మృతి చెందారు.
మృతిచెందిన కానిస్టేబుల్ రమేష్ ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అలోకేష్ పాదయాత్రలో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపణలు వస్తుండగా.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసినట్లు అధికార పార్టీ పక్షాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ నారా లోకేష్ పోలీసులను తిట్టారని చెబుతున్నారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ ఆలయ ఆవరణ నుండి పాదయాత్ర స్టార్ట్ కాగా, అక్కడి నుంచి సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకునే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారా లోకేష్ నుండి పోలీసులు మైక్ లాక్కున్నారు. అంతేకాదు లోకేష్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల తీరుపై నారా లోకేష్ స్టూల్ పై నిలబడి నిరసన తెలిపాడు.
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని..రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీశారు. మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడొద్దని అనడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. ప్రజలతో మాట్లాడకుండా పాదయాత్ర చేయాలని సైకో జగన్ కొత్త రూల్ పెట్టినట్టున్నాడు. పోలీసులు మైక్ లాగేసుకున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. పోలీసు జులుంను ఖండిస్తూ స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతుంటే.. ఆ స్టూల్ ను కూడా లాగేసే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.