MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించిన సుప్రీంకోర్ట్!

MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది.
ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా తమ పిటిషన్ ను ప్రస్తావించారు. అయితే స్టే కానీ, స్టేటస్ కో కానీ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కేసు ఫైలు సిట్ నుంచి సీబీఐ చేతికి వెళ్తే మొత్తం నీరుగారిపోతుందని, సాక్ష్యాలు తారుమారవుతాయని.. ఫైల్స్ ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ నుంచి ఒత్తిడి ఉందని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు.
అయితే, సీజేఐ బెంచ్ స్టే, స్టేటస్ కోను తిరస్కరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని, ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. కేసులో ఏమైనా మెరిట్స్ ఉంటే డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తామని మాత్రమే స్పష్టం చేసింది. మరోసారి, బెంచ్ చెప్పినదానికంటే ముందే ఈ నెల 13న విచారించాలని సిద్ధార్థ లుత్రా కోరాగా.. అందుకు కూడా ధర్మాసనం సమ్మతించలేదు.
సుప్రీంకోర్టు స్టేకి నిరాకరించడంతో ఈ కేసు సీబీఐకి వెళ్లడం ఖాయమైంది. ఇంతకు ముందు హైకోర్టులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పటి వరకు ఆర్డర్ను సస్పెండ్లో ఉంచాలని అభ్యర్ధించినా హైకోర్టు నిరాకరించి సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చారు. దీంతో సీబీఐ దర్యాప్తు మొదలుపెడుతుండగా.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడా జాప్యం కావడంతో ఏం జరగబోతుందన్నది చూడాల్సి ఉంది.