Uttar Pradesh: పదేళ్ల వయసులో మరణించిన కుర్రాడు.. 15 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చాడు!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 12:50 PM

Uttar Pradesh: పదేళ్ల వయసులో మరణించిన కుర్రాడు.. 15 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చాడు!

Uttar Pradesh: అప్పుడప్పుడు మనం నమ్మలేనివి కూడా జరిగి ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇది కూడా అలాంటి కథనమే. ఓ బాలుడు పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించాడు. కుటుంబ సభ్యులు కూడా వారి సంప్రదాయం ప్రకారం బాలుడికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. కానీ.. సడెన్ గా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అతను కుటుంబాన్ని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. నమ్మశక్యం కాని ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లా భగల్పూర్‌ బ్లాక్‌లో జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే.. మురాసో గ్రామానికి చెందిన అంగేశ్ యాదవ్ అనే యువకుడు 15 ఏళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కుమారుడిని అరటిబోదెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టారు. బాలబాలికలు మరణిస్తే ఇక్కడ ఇలానే అంత్యక్రియలు చేస్తారట. ఆ ప్రకారమే వాళ్ళు జరిపించారు.

అయితే, ఆదివారం అంగేశ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని గుర్తు పట్టి వెంట తీసుకెళ్లారు. దీంతో ఇదెలా సాధ్యమైందన్నది అర్ధం కాని కుటుంబసభ్యులు, గ్రామంలోని ప్రజలు అంగేశ్ ను అసలేమైంది ఆరాతీశారు. పదేళ్ల వయసులో జరిగింది కనుక అంగేశ్ కూడా ఆనాడు జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడు. పాముకాటు తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు గుర్తు లేదని.. కానీ, తనకు మెలకువ వచ్చేసరికి బీహార్ రాజధాని పాట్నాలో పాములు పట్టే వ్యక్తి తనకు చికిత్స అందిస్తూ కనిపించాడన్నాడు.

ఆ తర్వాత అతడే తనను పెంచి పెద్ద చేయగా.. పంజాబ్‌లోని ఓ భూస్వామి వద్ద అంగేశ్ పనికి కుదిరాడు. అయితే, అంతకు ముందు తన కుటుంబం గురించి ఓ లారీ డ్రైవర్‌కు చెప్పడంతో అంగేశ్‌ను అతడు ఆజంగఢ్ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అక్కడి వారితో అంగేశ్ తన కథను పంచుకోగా.. గ్రామస్థుల్లో ఒకరు అంగేశ్ ఫొటో తీసి మురసో గ్రామంలో తనకు తెలిసిన వారికి పంపించాడు. ఆ ఫొటో చూసిన అతడి తల్లి కుమారుడిని గుర్తుపట్టి కుటుంబ సభ్యులతో కలిసి మనియార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ అంగేశ్ వారిని గుర్తుపట్టడంతో పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.