Murder Case: భార్య ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేసిన భర్త!
![Murder Case: భార్య ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి చెత్త కుప్పలో పడేసిన భర్త!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Murder-Case.jpg)
Murder Case: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెట్టే వారు కొందరైతే.. తమ కాపురంలో చిచ్చుపెట్టిన వారిని కిరాతకం హతమార్చి జైలు పాలయ్యే వారు మరికొందరు. ఎవరు ఎలాంటి దారుణానికి పాల్పడినా శిక్ష మాత్రం పిల్లలకే. తల్లి దండ్రులు ఇలా చనిపోవడం.. జైలు పాలు కావడంతో ఆ పిల్లలు అనాధలవుతున్నారు.
అలా వివాహేతర సంబంధం కారణంగా మరో ప్రాణం బలవగా.. మరో భర్త నేరస్తుడయ్యాడు. భార్య ప్రియుడిని ఓ వ్యక్తి ప్లాన్ చేసి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో కలకలం సృష్టించింది. ఇంటికి పిలిపించి మరీ హత్య చేసిన ఆ వ్యక్తి మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా ముక్కలు ముక్కలుగా నరికి కవర్ లో మూటగట్టి చెత్తకుప్పలో పడేసి తనకేమీ తెలియదన్నట్లు ఉన్నాడు. అయితే.. సీసీ కెమెరాలు నిందితుడిని పట్టించాయి.
ఘజియాబాద్కు చెందిన మీలాల్, ప్రజాపతికి కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా ఓ కూతురు కూడా ఉంది. అయితే ప్రజాపతికి ఘజియాబాద్కు చెందిన అక్షయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలం తర్వాత ఈ విషయం మీలాల్కు తెలియగా.. అక్షయ్ కూడా మీలాల్ కు తెలిసిన వ్యక్తే కావడంతో అక్షయ్పై కోపంతో అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఓ రోజు కూతురి చికిత్స కోసం హాస్పిటల్లో ఉన్న సమయంలో అక్షయ్ను చంపాలని పక్కాగా ప్లాన్ చేసిన మీలాల్ తాను ఈ రాత్రి ఇంటికి రాలేనని చెప్పాడు. దీంతో అక్షయ్ను ఇంటికి పిలిచింది ఆ మహిళ. సరిగ్గా అదే సమయానికి మీలాల్ కూడా అక్కడికి చేరుకొని కత్తితో అక్షయ్ గొంతు కోసేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో నింపి ఘజియాబాద్లోని ఓ చెత్త కుప్పలో పడేశాడు.
అయితే, కొన్ని రోజుల తర్వాత చెత్త కుప్ప నుంచి దుర్వాస వస్తుండటంతో స్థానికులు చెత్తకుండీలోని ఓ సంచిని తెరిచి చూశారు. అందులో శరీర భాగాలను చూసి షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మీలాల్ను పట్టుకుని.. తనదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.