Telangana BJP: చిచ్చు పెట్టిన కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం!

Kaburulu

Kaburulu Desk

March 14, 2023 | 07:05 PM

Telangana BJP: చిచ్చు పెట్టిన కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు.. బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం!

Telangana BJP: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమీషన్ కూడా బండి సంజయ్ కు నోటీసులు ఇవ్వగా.. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మహిళా సంఘాలు కూడా బండి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ నేతలే కాదు బండి వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల మధ్య చిచ్చుపెడుతున్నాయి. లిక్కర్ స్కాంకు పాల్పడిన కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీలో సైతం బండి సంజయ్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ బీజేపీ, కవిత రాజకీయ శత్రువు ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలను తాను సమర్థించబోనని చెప్పారు. ఆ వ్యాఖ్యలు సంజయ్ వ్యక్తిగతమని.. ఆ వ్యాఖ్యలకు బీజేపీ పార్టీతో సంబంధం లేదని అన్నారు. అంతేకాదు ఆ వ్యాఖ్యలను సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని కూడా సూచించారు.

కాగా, ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని అన్నారు. సంజయ్ మాటలు వ్యక్తిగతం కాదని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే మాట్లాడారని కూడా చెప్పారు. కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల అర్వింద్ కు ఏదైనా ఇబ్బంది ఉన్నా, సందేహాలు ఉన్నా నేరుగా సంజయ్ తో మాట్లాడాలని.. అంతేకాని ఇలా మీడియా ముందు డైరెక్ట్ గా మాట్లాడటం సరికాదని అన్నారు.