Hyderabad: టెన్త్ క్లాస్ స్టూడెంట్తో పంతులమ్మ ప్రేమాయణం.. ఇద్దరూ కలిసి జంపింగ్

Hyderabad: పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కేవలం విద్యాబుద్ధులే కాదు.. సమాజంలో నడవడిక, పెద్దల పట్ల గౌరవం.. ఇలా మనిషిని మనిషిలా మలచడంలో టీచర్లదే కీలక పాత్ర. అలాంటి టీచర్లు ఆ విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పడం ఇప్పుడు కలవరపరుస్తోంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగులేదని చెప్పి స్కూల్ నుంచి వెళ్ళిన ఉపాధ్యాయురాలు ఇంటికి వెళ్ళకుండా అదే స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థితో కలిసి వెళ్లిపోయింది. విషయం బయటకి రాకుండా స్కూల్ యాజమాన్యం ఇటు టీచర్ అటు విద్యార్థి తల్లిదండ్రులతో వేరువేరుగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించినట్లు సమాచారం.
చందానగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ యువతి (26) టీచర్ గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఫిబ్రవరి 16న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అయితే, తన మనవరాలు కనిపించడం లేదంటూ ఆమె తాతయ్య చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాత రెండు రోజులకే ఆమె తిరిగి ఇంటికి రావడంతో కేసును విత్డ్రా చేసుకున్నాడు.
అదే సమయంలో తమ కుమారుడు కూడా కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత బాలుడు కూడా ఇంటికి చేరుకోవడంతో వాళ్ళు కూడా కేసు వెనక్కి తీసుకున్నారు. అయితే, బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు ఎక్కడికెళ్లావంటూ బాలుడిని ప్రశ్నించడంతో వీరిమధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆమెను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టీచర్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతోనే ఆమె ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాత బాలుడి జోలికి వెళ్లానని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు.