Jakarta Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. నిమిషాల్లో కాలి బూడిదైన ఇల్లు.. 17 మంది మృతి!

Jakarta Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తాలోని ఓ చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 250 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇండోనేసియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా చేస్తుంది. భారీ వర్షంతో పాటుగా పిడుగుల కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించారు.
ఇటీవల భారీ వర్షం సమయంలో పైప్లైన్ పగిలిపోయిందని, పిడుగు పాటు వల్ల మంటలు చెలరేగి వుంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల దేశంలో చమురు రవాణాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తబోదని అధికారులు పేర్కొన్నారు. చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడంతో పలు మార్లు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
దీనిపై ఆ దేశ పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎవరికీ ఎలాంటి అపాయం జరగకుండా అధికారులు వారిని అక్కడి నుంచి పంపించారు. ఇండోనేషియా రాష్ట్ర-యాజమాన్య సంస్థల మంత్రి ఎరిక్ థోహిర్ బాధితులకు, వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.