Telangana Congress: నిరంతరాయంగా రేవంత్ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర.. మరి సీనియర్లు ఎక్కడ?

Telangana Congress: చతికిల పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో మైలేజీ పెంచేందుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం చేపట్టిన పాదయాత్రకి కొనసాగింపుగా రాష్ట్రంలో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే.. దీనికి సీనియర్లు ఏమేరకు కలిసి వస్తున్నారు? అంటే.. ప్రశ్నగానే మిగిలింది.
ప్రస్తుతం ఈయాత్ర వరంగల్ లో సాగుతోంది. మంగళవారం పరకాలలో పర్యటిస్తున్నారు. ములుగులో మొదలైన నాటి నేటి వరకూ కూడా సీనియర్లు ఇటు వైపు చూస్తున్నారా? అంటే ఆ కాంగ్రెస్ నేతలకే గుర్తు రావడం లేదు. పోనీ ఎప్పుడు వెళ్తారంటే? ఎవరిని పలకరించినా.. రేపు మాపు అని మాత్రమే సమాధానం వస్తుంది. మిగతా జిల్లాలను పక్కనపెట్టినా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటికీ అక్కడ చెప్పుకోదగ్గ నాయకులూ కూడా ఉన్నారు.
కానీ, రేవంత్ యాత్ర వైపు మాత్రం ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. అధిష్టానంతో మంచి సంబంధం ఉన్నవారు కూడా ఎక్కడికక్కడ మౌనంగా ఉంటున్నారు. దీనిని రేవంత్ కూడా ప్రశ్నించడంలేదు. ఎవరు వస్తున్నారు? ఎవరు రావడం లేదు? అనే విషయం వరకు మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారు. దీంతో ఇతర నేతలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. సీనియర్ల జాడ లేకపోయినా ఎక్కడా కూడా రేవంత్ తగ్గకపోవడం గమనార్హం.
వరంగల్ జిల్లాలో యాత్ర విషయానికి వస్తే పేరున్న నేతలు ఎవరూ రావడం లేదు. కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, అనిల్ కుమార్, శివసేనారెడ్డి, సౌజన్య కట్కూరి, దేవేందర్రెడ్డి, కట్కూరి స్రవంతిరెడ్డి, తిరుపతిరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, జయమ్మ పాల్గొన్నారు. మరి మిగిలిన వారి సంగతేంటి? అనేది ప్రశ్న.