Ambati Rambabu: గత ప్రభుత్వ తొందరపాటు వల్లనే ఇప్పుడు రిపేర్లు.. పోలవరంపై మంత్రి అంబటి వ్యాఖ్యలు!

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలనే ఇప్పుడు మరమత్తులు చేస్తూ ఆలస్యమవుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అబంటి రాంబాబు.. అనంతరం మాట్లాడుతూ ఈ సీజన్ లో పోలవరానికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
వచ్చే నాలుగు నెలలు ప్రాజెక్టుకు ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన అంబటి గత ప్రభుత్వం తొందరపాటు వల్లనే ఇప్పుడు ఇంత కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని విమర్శించారు. పోలవరంపై తాము ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేసిన ఆయన.. అవగాహనా రాహిత్యంతో చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి మానవతప్పిదమే కారణమని ఆరోపించిన మంత్రి.. ఈ మాట నేను చెప్పడం లేదని.. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట రిపేరు చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని.. అయితే ఇప్పుడు ఆ మరమ్మతులు ఎలా చేయాలనే దానిని అధికారులు పరిశీలిస్తున్నారని.. ఈ సీజన్లో కచ్చితంగా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.
గతంలో వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కి భారీగా నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ లో చంద్రబాబు తప్పిదమే కనిపిస్తోంది. ఆ గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని.. డయాఫ్రమ్ వాల్ ని రిపేరు చేసేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పనులు కాస్త ఆలస్యం అయినా కూడా నాణ్యంగా ఉండాలనేది మా ప్రభుత్వం అభిమతమని చెప్పారు. వైఎస్ఆర్ కలలుగన్న ప్రాజెక్టు ఇదని.. కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు జగన్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.