American Airlines: విమానంలో మద్యంమత్తు.. పక్క ప్యాసింజర్పై మూత్రం పోసిన ప్రయాణికుడు!

American Airlines: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ఓ ప్రయాణికుడు తాగినమైకంలో ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. మళ్లీ న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.
శుక్రవారం రాత్రి న్యూయార్క్ నుంచి AA292 అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఆ విమానం 14 గంటల 30 నిమిషాల ప్రయాణం అనంతరం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం 10.12 గంటలకు చేరుకుంది ఆ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో తాను కూర్చున్న చోటే మూత్రవిసర్జన చేశాడు. అయితే అది తోటి ప్రయాణికుడిపై పడడంతో అతను సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
వెంటనే సిబ్బంది పైలట్ ద్వారా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశారు. విమానం 14 గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగానే నిందితుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను చేసిన పనికి ఆ విద్యార్థి క్షమాపణ కోరడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్లైన్స్.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చింది. నిందితుడు మూత్ర విసర్జన చేసిన విషయం గురించి పైలట్కు క్యాబిన్ క్రూ సమాచారం ఇవ్వడంతో.. అతడు ఏటీసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతడ్ని సీఐఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.