Byreddy Rajasekhar Reddy: సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాయలసీమ.. బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 06:41 PM

Byreddy Rajasekhar Reddy: సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాయలసీమ.. బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Byreddy Rajasekhar Reddy: ఏపీలోని మూడు ప్రాంతాల మధ్య రాయలసీమ ఇప్పుడు సుడిగుండంలో ఇరుక్కుపోయిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషంట్ మాదిరి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

తీగల వంతెన వద్దని ఎమ్యెల్యే, ఎంపీలకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్న రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు 5,300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అప్పరభద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. దీనిపై ఈనెల 25న రాజోలి బండ నుండి పాదయాత్ర కొనసాగిస్తామని ప్రకటించారు. అప్పరభద్ర ప్రాజెక్టు విషయంలో పాలకులకు రాబోయే కాలంలో ప్రజలే బుద్దిచెబుతారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

కాగా, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా బైరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేసింది శూన్యమని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూనే, రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, విశాఖలో పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెబుతున్నారని బైరెడ్డి అన్నారు.

రాయలసీమ ప్రయోజనాల కోసం తాను చేస్తున్న పోరాటానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి-బ్యారేజ్ నిర్మించాలని, దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని వ్యాఖ్యానించారు. తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలనే డిమాండ్ తో ఛలో సిద్ధేశ్వరం అని పిలుపునిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారని గుర్తుచేసిన ఆయన ఈనెల 25న పాదయాత్రకు కూడా ప్రజల మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.