Telangana Congress: అక్బరుద్దీన్ తో చర్చలపై రాజకీయ ప్రకంపనలు.. వివరణ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు

Telangana Congress: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. అదలా ఉండగానే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది.
ఒకవైపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని అక్బరుద్దీన్ ఏకిపారేయడం.. ఈసారి యాభై స్థానాలలో పోటీచేస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ నేతలు అక్బరుద్దీన్ తో భేటీ కావడంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు అండగా ఉంటూ వచ్చిన ఎంఐఎం ఈసారి సైడ్ మార్చేస్తుందా అనేలా రాజకీయ వాతావరణం కనిపించింది. దీంతో మీడియా వర్గాలు కాంగ్రెస్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఈ భేటీపై వివరణ ఇచ్చారు.
ఎంఐఎం ఎమ్మెల్యేతో మాట్లాడితే తప్పా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. అక్బరుద్దీన్, తాను పాత మిత్రులమని చెప్పారు. కాంగ్రెస్, ఎమ్ఐఎం రెండూ సెక్యులర్ భావాలున్న పార్టీలేనని అన్నారు. తమ ఇద్దరి మధ్య రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, గాంధీ కుటుంబం గురించి చర్చ జరిగిందని తెలిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు విషయం భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు.
ఇక ఇదే విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ తో రాజకీయ చర్చలు ఏమీ జరగలేదన్నారు. కేవలం బడ్జెట్ మీదనే చర్చించామని.. అక్బర్ తో భేటీ పెద్ద వార్త ఏమీ కాదన్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ది తన పక్క సీటేనని.. ఎప్పుడూ మాట్లాడినట్టుగానే మాట్లాడానని, అందులో కొత్తేమీ లేదని అన్నారు. పిచ్చాపాటీగా ముచ్చటించుకున్నామని తెలిపారు. తమ సంభాషణను రాజకీయ ప్రాధాన్యతా కోణంలో చూడాల్సిన అవసరం లేదని తోటి ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడానని భట్టి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా ఇలాగే స్పందించారు. అక్బరుద్దీన్ ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని.. కలిసి పనిచేద్దాం అనే అంశంపై చర్చించలేదని వెల్లడించారు. అక్బరుద్దీన్ సభలో ప్రకటించిన మేరకు ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసే అంశంపై మాట్లాడినట్టు శ్రీధర్ బాబు వివరించారు. తాజా పరిణామాలపై మాత్రమే చర్చించుకున్నామని తెలిపారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ భేటీ మాత్రం హాట్ టాపిక్ గా నిలిచింది.