MK Stalin: కాంగ్రెస్ లేని ఫ్రంట్కు అర్ధమే లేదు.. తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు!

MK Stalin: ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని తీసుకురావాలని.. అందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపులిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో కూడా ఉన్నారు. అయితే, డీఎంకే అధ్యక్షులు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోరుతూ స్టాలిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. థర్డ్ ఫ్రంట్ ఆలోచన అర్ధంలేని అంశంగా పేర్కొన్న స్టాలిన్.. కాంగ్రెస్ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం కూడా అర్దరహితం అన్నారు. అలాగే ఎన్నికల తర్వాత కూటమి ఏర్పాటు వంటి ఆలోచనలు కూడా చెల్లవని చెప్పారు.
బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలబడాలని కూడా స్టాలిన్ పిలపునిచ్చారు. రానున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. దీన్ని గ్రహించి ప్రతిపక్షాలు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. అందరూ ఒక్కతాటిపైకి వస్తేనే బీజేపీని ఓడించగలమని చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికలకు ముందే చేతులు కలపాలని.. ఎన్నికల తర్వాత కలవడమనేది సాధ్యం కాదని అన్నారు.
థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించడం కూడా వేస్ట్ అని అభిప్రాయపడిన స్టాలిన్.. ఈ సరళమైన ఎన్నికల అంకగణితాన్ని అర్థం చేసుకుని ఏకతాటిపై నిలబడాలని, బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలను నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారనేది అనేది కీలకం కాగా.. ఎన్నికల తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కాదుని స్టాలిన్ స్పష్టం చేశారు. దక్షణాది నుండే కేసీఆర్ ఒక మార్గంలో ప్రయాణిస్తుంటే.. అదే దక్షణాది నుండి స్టాలిన్ ఇలా మాట్లాడడం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.