MLC Kavitha: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఏకంగా 9 గంటలపాటు సాగిన విచారణ!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 09:41 PM

MLC Kavitha: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఏకంగా 9 గంటలపాటు సాగిన విచారణ!

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 8 నుండి 9 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకు ఇక వెళ్లొచ్చని చెప్పారు. ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 వరకు సాగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భోజనానికి విరామమిచ్చారు.

నిజానికి సాయంత్రం 5.30 గంటలకే ఈడీ విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని అధికారులు పెంచారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈ కేసులో అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలసి సాయంత్రం సెషన్‌లో విచారించారు. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులు, 10 ఫోన్ల విధ్వంసం వంటి అంశాలపై ఇద్దరీనీ కూపీ లాగినట్లు తెలుస్తోంది.

కాగా, భోజన విరామం కోసం మధ్యాహ్నం బయటికి వచ్చిన కవిత మళ్లీలోనికి వెళ్లారు. అప్పుడు ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్‌ను తమకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులు కోరగా ఆమె తన వ్యక్తిగత సిబ్బంది దగ్గరున్న ఫోన్‌ను అప్పగించారు. ఆ ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ కేసులో అక్రమాలకు సంబంధించిన డేటా ఉన్న పది ఫోన్లను కవిత పగలగొట్టారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫోన్లలో డేటాను రిట్రీవ్ చేసి ఆమెకు చూపించినట్లు తెలుస్తోంది.

ఇక, అధికారులకు సమాధానాలివ్వడానికి కవిత చాలా సమయం తీసుకోవడంతో విచారణ ఆలస్యమైనట్లు సమాచారం. ఆమెకు మొత్తం 26 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. కాగా, విచార‌ణ ముగిసిన అనంత‌రం తుగ్ల‌క్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి క‌విత బ‌య‌ల్దేరారు. అయితే ఈడీ ఆఫీసు నుంచి క‌విత బ‌య‌ట‌కు రాగానే ఆమె మ‌ద్ద‌తుదారులు జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై క‌విత‌క్క అంటూ నినదించారు. కాగా, తదుపరి కర్తవ్యంపై కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు న్యాయనిపుణులతో సంప్రదింపులు కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.