Telangan Cabinet Meet: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

Telangan Cabinet Meet: క్యాబినెట్ భేటీలో తెలంగాణ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇళ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలోనూ 3 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేస్తామని.. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారికి మూడు విడతల్లో రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇక హౌసింగ్ బోర్డు ద్వారా గతంలో ఇళ్లు నిర్మించుకున్న వారి ఇంటి అప్పులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
అదేవిధంగా రాష్ట్రంలో రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం. మిగతా 118 నియోజకవర్గాల్లో 1100 మంది చొప్పున ఈ దఫాలో అందజేస్తామన్నారు. ఈ మేరకు లబ్దిదారుల ఎంపిక వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్ల ద్వారానే ఎంపిక జరుగుతుందిని మంత్రి హరీశ్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత గొర్రెల పంపిణీని ఏప్రిల్ లో ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించగా.. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4వేల 463 కోట్లు కేటాయించింది. అటు పోడు భూముల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని కూడా మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదించింది.