Etela Rajender: 24 గంటల మూడు ఫేజ్ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!

Etela Rajender: తెలంగాణలో రైతులకు కనుక 24 గంటల మూడు ఫేజ్ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచేస్తున్నాయి.
మహబూబ్ నగర్ లో పర్యటించిన ఈటల రాజేందర్ ఎప్పటి లాగానే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ పచ్చి ఫ్యూడల్ భావజాలాన్ని, దొరతనాన్ని తెలియజెప్పుకొని పేదల మీద కసి తీర్చుకునే విధానంలో భాగమే ధరణి అని ఆరోపించారు. సర్కారు దుర్మార్గానికి, దాష్టికానికి రాష్ట్రంలో వేలమంది ఆత్మహత్యలే నిదర్శనమన్నారు. బిల్లులు రాక సర్పంచులు, కాంట్రాక్టర్లు.. ఉద్యోగాలు రాక యువత, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని, 24 గంటల మూడు ఫేజ్ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఒక దళిత బిడ్డ సాయన్న వరుసగా ఐదు సార్లు గెలిచిన నేతని.. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలేదని.. కేసీఆర్ దొర
అహంకారానికి ఇదే నిదర్శనమన్నారు. సాయన్న మృతితోనే దళితుల పట్ల ఆయన వైఖరి తేటతెల్లం అయ్యిందన్న ఈటల.. కేసీఆర్ అవమానపరిచింది సాయన్న ఒక్కడిని కాదు దళిత జాతి మొత్తన్నాని విమర్శించారు.