Hyderabad: భార్యతో గొడవ.. ఆమె చూస్తుండగానే బిల్డింగ్‌పై నుండి దూకి భర్త ఆత్మహత్య!

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 03:44 PM

Hyderabad: భార్యతో గొడవ.. ఆమె చూస్తుండగానే బిల్డింగ్‌పై నుండి దూకి భర్త ఆత్మహత్య!

Hyderabad: భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భర్త తీసుకున్న నిర్ణయంతో భార్య ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారు అయిన నార్సింగిలో భార్యతో గొడవపడి ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

భార్య కళ్లెదుటే బిల్డింగ్ పై నుంచి దూకేయగా.. తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త కన్నుమూశాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో రేవన్ సిద్దప్ప అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయంపై మాటామాటా పెరగడంతో సిద్దప్ప తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్య చూస్తుండగానే బిల్డింగ్ పై నుంచి దూకేశాడు.

సిద్దప్ప దూకేయడం.. భార్య పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి సిద్దప్పను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనిని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడం, తీవ్ర రక్త స్రావం కారణంగా సిద్దప్ప ప్రాణాలు కోల్పోయాడు. తను చూస్తుండగానే భర్త బలవన్మరణానికి పాల్పడడంతో సిద్దప్ప భార్య కన్నీటిపర్యంతమవుతూ షాక్ కు లోనయ్యింది.

కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య ఘర్షణే కారణమా లేక ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. ఈ ఘటన చుట్టుపక్కల వారిని కూడా కలవరానికి గురిచేసింది. క్షణికావేశమో.. లేక భార్యపై కోపమో.. ఏదైతేనేం ప్రాణాలు తీసుకోవాలనే ఓ భర్త తీసుకున్న నిర్ణయం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. భార్య, భర్తల మధ్య వివాదాలు నీటి బుడగలా ఉండాలే కానీ.. జీవితాన్ని నాశనం చేసేంతగా ఉండకూడదు అనే దానికి నిదర్శనంగా ఈ విషాద ఘటనగా చెప్పుకోవచ్చు.