Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 15 కిలోల బంగారం పట్టివేత.. నలుగురు మహిళల అరెస్ట్!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 12:52 PM

Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 15 కిలోల బంగారం పట్టివేత.. నలుగురు మహిళల అరెస్ట్!

Gold Smuggling: అధికారులు ఎంత పగడ్బంధీగా తనిఖీలు చేపడుతున్నా.. రోజూ అక్రమ బంగారం రవాణాకు పాల్పడే వారికి అరెస్టులు చేస్తున్నా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రం దొంగ బంగారం రవాణా ఆగడం లేదు. పోలీసుల ఎత్తులకు అక్రమార్కులు పై ఎత్తులు వేస్తూ అక్రమ బంగారం రవాణాకి సిద్దపడుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 15 కేజీల బంగారం తాజాగా పట్టుబడింది.

శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి 23 మంది సూడాన్ మహిళా ప్రయాణికులు గ్రూప్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే ప్రయత్నం చేశారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో సూడాన్ జాతీయులు అడ్డంగా బుక్ అయ్యారు. నిందితుల వద్ద నుంచి 14.906 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

బంగారం విలువ రూ.7.90 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా.. మిగిలిన వారిని అధికారులు విచారిస్తున్నారు. నిందితులు షూకింద బంగారం దాచిపెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని బంగారం తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. షూ మడమల స్థానంలో ప్రత్యేక అరలు బయటపడ్డాయని చెప్పారు.

మొత్తం నలుగురి దగ్గరా కలిపి మొత్తం సుమారు 15 కిలోల బంగారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. మిగతా వారిని కూడా పరిశీలించినా ఏమీ దొరకలేదన్నారు. దీంతో ఆ నలుగురు మహిళలను అరెస్టు చేసి, మిగతా వారికి విచారిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా శంషాబాద్ వరకు ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఎలా తీసుకురాగలిగారనే కోణంలో విచారణ చేస్తున్నారు.