Tirumala Darshan:నిజం తెలుసుకోండి… తిరుమల శ్రీవారి దర్శనం ఆరునెలల పాటు నిలిపివేస్తారనేది అవాస్తవం

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 10:57 PM

Tirumala Darshan:నిజం తెలుసుకోండి… తిరుమల శ్రీవారి దర్శనం ఆరునెలల పాటు నిలిపివేస్తారనేది అవాస్తవం

శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని టిటిడి స్పష్టం చేసింది.

టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు.

ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చని, బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చని, గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని, గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తామని, ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయని, టిటిడి ధర్మకర్తల మండలి తెలిపింది.

వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేసింది.