Weather Update: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. వీడని అకాల వర్షం.. మరో 24 గంటలు భారీ వర్షాలు!

Weather Update: తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడలేదు. ఇప్పటికే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలలో పూత, పిందె రాలిపడ్డాయి. ఇప్పటికే రైతన్నలు దిగాలు పడిపోయారు.
ఇదిలా ఉండగానే మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో ఉన్నట్టుండి క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని అలెర్ట్ జారీచేశారు.
కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పెనుగాలులు, వడగళ్ల వానతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంపై రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ జారీ చేశారు.
మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరెంజ్అలర్ట్ను కొనసాగించింది. ఆదివారం రాత్రికి రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల వడగండ్లు పడే చాన్స్ ఉందని తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.