TSPSC Paper Leakage Case: దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు.. రేపు కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు!

Kaburulu

Kaburulu Desk

March 18, 2023 | 05:24 PM

TSPSC Paper Leakage Case: దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు.. రేపు కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు!

TSPSC Paper Leakage Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముందు ఒక్క పేపర్ గా మొదలై చివరికి నాలుగు పేపర్లు లీకైనట్లు తేలడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు.

అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడంపై అప్పట్లోనే వారి స్వగ్రామం జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది. పరీక్ష రాసిన వారు ప్రిలిమ్స్ క్వాలిఫై కాగా.. రాజశేఖర్ ముందే పేపర్ లీక్ చేసి బంధువులకు ఇచ్చాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

కాగా, పేపర్ లీకేజీ వ్యహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీఎం కేసీఆర్ నుండి మంత్రుల వరకూ అందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ ఘటనకు.. సీఎం కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రశ్నా పత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు. శనివారం ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కోదండరాం దీక్షకు దిగారు.

కాగా, రేపు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షకు పిలుపు ఇచ్చింది. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పేపర్ లీక్ వ్య వహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారని రేవంత్‌ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ పిలుపు నిచ్చారు. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాడుతుందని, కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు కూడా కేసీఆర్ పక్షాన లేడంటూ రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.