Hyderabad Fire Accident: మరో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న 10 ఫైర్ ఇంజన్లు!

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్గి రాజుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు గోదాంలోనే ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్లాస్టిక్ కాలిన ఘాటైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాలు, స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
గోదాం పక్కనే పాఠశాల ఉండడంతో అధికారులు దాన్ని ఖాళీ చేయించారు. పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ ను తొలగించాలని చెప్పినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాంలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. రహదారికి దగ్గరగా ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో బెంగళూరు, కర్నూలు రూట్లో వెళ్తున్న వాహనాలను మెహదీపట్నం మీదుగా మళ్లించారు.