AP Temples: తలనీలాలు సమర్పించే భక్తులకు షాక్…! టికెట్ ధర భారీగా పెంపు…!

హిందూ సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ టికెట్ ధర రూ. 40కి పెంచింది. ఇక నుంచి ఆలయాల్లో తలనీలాలను తీసే విధులను నిర్వహించే క్షురకులు కమిషన్ గా రూ. 20 లు ఇవ్వాలని దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ ఆదేశించారు వాస్తవానికి ప్రస్తుతం తలనీలాల సమర్పణకు టికెట్ ధర రూ. 25 లు ఉంది. ఈ మొత్తం క్షురకులకే ఇస్తున్నారు. ఇక నుంచి వీరందరికీ కమిషన్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
తలనీలాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని క్షురకులకే పంచనున్నామని హరి జవహర్లాల్ తెలిపారు. అయితే ఆలయాల్లో తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.20 వేలకంటే తక్కువుగా ఉంటే.. అప్పుడు తలనీలాలను అమ్మడంతో వచ్చే ఆదాయంనుంచి డబ్బులను తీసుకుని మొత్తం ఒకొక్కరికి రూ.20 వేల రూపాయలను చెల్లించనున్నారు. అప్పుడు కూడా క్షురకులకు చెల్లించడానికి ఆదాయం సరిపోకపోతే.. అప్పుడు దేవాలయంలోని ఆదాయంలో 3 శాతం వినియోగించే వీలుని కల్పించారు దేవాదాయశాఖ ఇన్ఛార్జ్.