Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతవరకు వచ్చిందో… అక్కడి కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు, ఇందులో 360 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి మొదటి చిత్రం తెరపైకి వచ్చింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఫోటోలను షేర్ చేశారు. మందిర నిర్మాణ గొప్పతనాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఫోటోలను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను రామ భక్తులు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. చిత్రాన్ని షేర్ చేస్తూ.. చంపత్ రాయ్ ఇలా వ్రాశారు.. “జై శ్రీ రామ్. ఆ శ్రీరామ చంద్రుడు కొలువుదీరనున్న గుర్భగుడి ఇదే నంటూ క్యాప్షన్లో రాసుకొచ్చారు. సూర్యోదయ కిరణాలు విగ్రహంపై పడేలా గర్భగుడి రూపకల్పన చేసినట్లు చెప్పారు. అంతకు ముందు రోజు గురువారం నాడు కూడా రామమందిరం చిత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
పలువురు ప్రముఖులు కూడా ఈ ఫొటోను షేర్ చేశారు. ఇవే ఫోటోలను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రపంచంలో ప్రాణం కంటే ప్రియమైనది, పవిత్రమైన అయోధ్య ధామంగా క్యాప్షన్లో రాసుకొచ్చారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ స్థలంలో గీసిన అద్భుతమైన, అతీంద్రియ చిత్రం’ అని డిప్యూటీ సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు. గర్భగుడిలో ఆ శ్రీరాముడి విగ్రహాన్ని 2024 జనవరి మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.