Sri Rama Navami: రాములోరి కళ్యాణంలో అరుదైన దృశ్యం.. వధూ వరులను ఆశీర్వదించిన వానరాలు !

ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని హిందువుల నమ్మకం. అసలు దేశంలో రామాలయం లేని ఊరు దాదాపు కనిపించదంటే అతిశయోక్తి కాదు.. రాముడు.. రామ భక్తుడు హనుమంతుడు హిందువులకు అత్యంత ఇష్టమైన దేవుళ్ళు.. రామ నామం జపిస్తే చాలు.. హనుమంతుడు ప్రసన్నమవుతాడని.. ఆధ్యాత్మిక గ్రంథాల ఉవాచ. అందుకనే అంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా రామ భక్తులై ఉండాలని.. అప్పుడే విశేషమైన ఫలితాలను వస్తాయని అంటారు.
జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆసక్తి కరమైన దృశ్యం కనువిందు చేసింది. సీతారాముల కళ్యాణ జరుగుతున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చాయో కానీ ఓ రెండు వానరాలు అనుకోని అతిధులుగా విచ్చేశాయి, సీతారామ కళ్యాణం జరుగుతున్నంత సేపు కదల కుండా కనులారా తిలకించాయి.
కళ్యాణ ముగిసిన అనంతరం.. పీట దగ్గరకు వెళ్లి వధూవరులైన సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న అక్షింతలను చేతిలోకి తీసుకొని.. వాటిని విగ్రహాలపై వేసి ఆశీర్వదించాయి. అనంతరం మరి కొన్ని అక్షింతలను, పండ్లు ఫలాలను నోట్లో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులంతా రాములోరి కళ్యాణానికి హనుమంతుల వారి సైన్యం వచ్చిదంటూ మనస్పూర్తి నమస్కరించుకున్నారు.