Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఏమందంటే?

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 04:03 PM

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఏమందంటే?

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈమధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నేడు ఎన్నికల సంఘం నియామకాలపై కీలక తీర్పు వెల్లడించింది.

ఒకవిధంగా ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అని ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లే సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు.. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇందుకోసం పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని కూడా కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఒక కమిటీని నియమించిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించడానికి నియమించిన ఈ కమిటీలో ప్రధానితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విపక్ష నేత సభ్యులుగా ఉంటారని ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది.

కేంద్ర ఎన్నికల కమిషనర్, సభ్యులను నియమించే విషయంలో పారదర్శకత కోసమే ఈ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. జస్టిస్ కె.ఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వెంట్లను లొంగతీసుకోవడం నుంచి ఎన్నికల సంఘం దూరంగా ఉండాలని భావించిన సుప్రీం.. స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. ఎన్నికల కమిషన్ కొన్ని సందర్భాల్లో హాని కలిగించేలా కృత్రిమ పరిస్థితికి దారితీస్తుందని అభిప్రాయపడింది. మరో 13 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ తీర్పు దేశ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.