MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణలో మరో ట్విస్ట్.. నేడు విచారణకు హాజరు కాలేనన్న కవిత!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 12:54 PM

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణలో మరో ట్విస్ట్.. నేడు విచారణకు హాజరు కాలేనన్న కవిత!

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై న్యాయవాది సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత.

అనారోగ్య కారణాలు కూడా ఉండడంతో మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత అభ్యర్థన చేశారు. అయితే కవిత రిక్వెస్ట్‌పై ఈడీ అధికారులు ఇంకా స్పందించలేదు. సోమ భరత్ తో పంపిన ప్రతిపాదనను ఈడీ అంగీకరించనట్లు తెలుస్తుంది. కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఆమె ఏం చేస్తారు? విచారణకు రాకపోతే ఈడీ తదుపరి చర్యలు ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతానికి అయితే కవిత నివాసం వద్ద ఉన్న ఎస్కార్ట్‌ వాహనం మాత్రం వెళ్లిపోగా.. ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆసక్తిగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఈ నెల 11న సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈనెల 16న మరోసారి రావాలని అదే రోజు సమన్లు జారీ చేశారు. అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

కవిత పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆమె అనారోగ్య కారణంతో ఈ రోజు విచారణకు రాలేనని, మరో తేదీని నిర్ణయించాలని ఈడీని కోరారు. దీంతో పాటు సుప్రీంలో తన పిటీషన్ పై విచారణ పూర్తయిన తర్వాతే వస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ తర్వాత ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది.