MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 10:06 PM

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 21 మంది!

MLC Elections: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా మారింది. గురువారం నామినేషన్ల ఘట్టం ముగియగా.. మొత్తం 21 నామినేషన్లు చెల్లుబాటైనట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. అయితే, 27 వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో భారీగానే విత్ డ్రాలు ఉంటాయని అనుకున్నారు. కానీ, అదేమీ జరగలేదు. ఊహించని విధంగా 21 మంది బరిలో నిలిచారు.

బీజేపీ అభ్యర్థిగా ఏ వెంకట నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా.. ప్రజావాణి పార్టీ తరపున ఎల్‌ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. ఇక 19 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కావడం విశేషం. అయిలునేని సంతోశ్‌కుమార్‌, కే సాయన్న, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కే ప్రభాకర్‌, డాక్టర్‌ డీ వెంకటేశ్వర్లు, జీ హర్షవర్థన్‌రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, సీ చంద్రశేఖర్‌, సీ పార్వతి, టీ అన్నత్‌ నారాయణ్‌, డీ మల్లారెడ్డి, డాక్టర్‌ వీ నాథనైల్‌, పాపన్న గిరి మానిక్‌రెడ్డి, బీ భుజంగరావు, ఎం తిరుపతి, లక్ష్మీ నారాయణ మారంపల్లి, ఎస్‌ విజయకుమార్‌, ఎ వినయ్‌బాబులు ఎన్నికల బరిలో ఉన్నారు.

నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులెవరూ విత్ డ్రా చేసుకోకుండా బరిలో ఉండడంతో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా.. 9 జిల్లాల పరిధిలో 137 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ సామాగ్రిని సిద్ధం చేశారు. మార్చి 13న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 16న కౌంటింగ్‌, 21న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తొమ్మిది జిల్లాల పరిధిలో 29,720 మంది ఓటర్లు ఉన్నారు. 9,186 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మేడ్చల్‌, అత్యల్పంగా 877 ఓటర్లతో జోగులాంబ గద్వాల్‌ నిలిచింది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.