Kuppam Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మెడికల్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి!

Kuppam Road Accident: కారు-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలో జరిగింది. జిల్లాలోని గుడుపల్లె మండలంలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై చిన్నశెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఫలితంగా కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు కడప, నెల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులు కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కాగా.. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పార్టీ జరుపుకుని అనంతరం తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఒకేసారి ముగ్గురు విద్యార్థుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను ఈపీఎస్ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రాక్టీస్ డాక్టర్లు వికాస్, కళ్యాణ్, ప్రవీణ్గా గుర్తించగా.. వారిలో ఇద్దరు కడప జిల్లాకు, ఒకరు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.
కాగా, మనం నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను చూస్తూనే ఉంటాం. అయితే, ఈ రోడ్డు ప్రమాదానికి గురైన కారు ఆనవాళ్లు కూడా లేకుండా ఇనుప ముద్దలాగా మారిపోయింది. దీనిని బట్టి ఎంత వేగంతో ఈ కారు ఆ లారీని ఢీ కొట్టిందో చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా చెప్తే కానీ ఇది కారు అని గుర్తుపట్టలేనంతగా ధ్వంసం అయ్యిందంటే ప్రమాదం స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూపు రేఖలు లేకుండా పోయిన మారుతి స్విఫ్ట్ కారు వేగానికి తోడు లారీ కూడా వేగంగా వస్తుండడంతో ప్రమాదం ఈ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది.