Hyderabad Police: ట్రాఫిక్ చలాన్తో దొరికిన పదేళ్ల క్రితం పోయిన బైక్.. యజమాని ఆనందానికి అవధుల్లేవ్!

Hyderabad Police: ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు లేపేసే దొంగలు, షాపింగ్ మాల్స్ వద్ద.. వివిధ పనుల మీద బయటకి వెళ్ళినపుడు సెంటర్లు, చౌరస్తాలలో బైక్ అలా పెట్టి వెళ్లి వచ్చేసరికి బైకులు మాయం చేసే ముఠాలు మెట్రో నగరాలలో కోకొల్లలు ఉంటుంటాయి. హైదరాబాద్ లో అయితే తరచుగా ఏదో ఒక మూలాన ఇలాంటి దొంగతనాలు బయటపడుతూనే ఉంటాయి. అలాగే పదేళ్ల క్రితం తన బైక్ పోగొట్టుకున్న యజమానికి ఇక అది దొరకదని ఆశలు వదిలేసుకున్నాడు. కానీ, అనుకోకుండా మళ్ళీ ఆ బైక్ తనకు దొరికింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ యూసఫ్ గూడకు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం మాసాబ్ ట్యాంక్లోని జేఎన్టీయూ-ఎఫ్ ఆఫీస్ వద్ద తన బైక్ పోగొట్టుకున్నాడు. పార్క్ చేసి లోపలికి వెళ్లి పని పూర్తి చేసుకొని బయటకి వచ్చేసరికి బైక్ లేపేశారు. తన బైక్ చోరీకి గురైందని గుర్తించిన ఆ వ్యక్తి హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి బైక్ ఆచూకి కనిపెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ.. ఆ బైక్ మాత్రం దొరకలే.
తన బైక్ పోయి పదేళ్లు కాగా అప్పట్లో కొన్నాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ కూడా చేసేవాడట. కానీ, తిరిగి తిరిగి ఇక బైక్ దొరకదని ఆశలు వదిలేసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లడం కూడా కొన్నేళ్లుగా మానేశాడు. అయితే, తాజాగా సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసుల నుంచి శుక్రవారం సదరు వ్యక్తి ఒక నోటిస్ వచ్చింది. గత రెండు రోజులుగా మీ వాహనం నో పార్కింగ్ ప్రాంతంలో ఉందని.. వాహన పత్రాలతో వచ్చి చలాన్ కట్టి మీ బైక్ తీసుకెళ్ళమని నోటీసులో పేర్కొన్నారు.
దీంతో నోటీస్ ఆధారంగా అక్కడకి వెళ్లి చూస్తే పదేళ్ల క్రితం పోయిన తన బైక్ కనిపించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బైక్ నెంబర్ ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు ఆ నోటీస్ పంపగా.. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. దీంతో పోలీసులు విచారణ చేసి అతని బైక్ అతనికి అప్పగించారు.