Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసులో అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా?.. సజ్జల సంచలన వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 03:22 PM

Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసులో అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా?.. సజ్జల సంచలన వ్యాఖ్యలు!

Sajjala Ramakrishna Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు వివేకా హత్యతో అవినాష్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా జగన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదని, కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని తెలిపారు. వివేకా ఫోన్ లోని డేటా రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించిన సజ్జల.. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదని నిలదీశారు. వివేకా కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి వెళ్లారని వెల్లడించారు.

టీడీపీ నేతలు బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డికి ఈ హత్యతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని గతంలో సీఐడీ చెప్పిందని స్పష్టం చేసిన సజ్జల.. తొలి నుంచి సిట్ చేసిన విచారణను సీబీఐ కట్టకట్టి పక్కన పెట్టిందని విమర్శించారు. హత్య చేసినట్లు చెబుతున్న వారంతా వివేకాతో పాటు దశాబ్దాలుగా ఉన్నవారే అని.. వారు హత్య చేశారు అంటే దాని వెనుక ఉన్న కారణాలను చూడాలని ఆయన సూచించారు.

వివేకా హత్య కేసులో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబుదేనన్న సజ్జల.. సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉందిని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీలోని తన కోవర్టుల ద్వారా చంద్రబాబు సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని.. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్‌ ముద్ర వేసి కుట్రలు చేశారని.. ఇప్పుడు జగన్‌పై కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేసి ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తూ.. టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావించి అదే నిజమనేలా చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.