Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ చోరీ.. ఆలయం మూసివేత!

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 03:56 PM

Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ చోరీ.. ఆలయం మూసివేత!

Kondagattu Temple: కొండగట్టు ఆంజనేయస్వామి గుడి ప్రాముఖ్యత గురించి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ ఆలయంలో ఆంజనేయుని దర్శనానికి క్యూలు కడతారు. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎన్నికల రథమైన వారాహీని ఇక్కడే తొలిపూజ చేసిన సంగతి తెలిసిందే కాగా.. సీఎం కేసీఆర్‌ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

ఇదిలా ఉండగా తాజాగా కొండగట్టు ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి 1.30 నిమిషాల సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రధాన ఆలయానికి వెనక వైపున ఉన్న బేతాళ గుడి ప్రాంతం నుంచి లోపలకు చొరబడినట్లు తెలిసింది. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితులు గర్భగుడిలోని రెండు విగ్రహాలు, విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం.

ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరి కాగా, 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమండపంలోని ఆంజనేయ స్వామి వారి వెండి తోరణం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుంచి దొంగలు పడ్డట్లు గుర్తించి వెంటనే విషయాన్ని అధికారులకు చెప్పారు. ప్రస్తుతానికి ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి డాగ్ స్క్వాడ్ ఆగినట్లు చెప్తున్నారు. స్పెషల్‌ టీమ్స్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించే పనిలో పడ్డాయి. కాగా, ఆలయం మూసివేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు.