Viveka Murder: వివేకాను చంపించింది ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటీషన్

Kaburulu

Kaburulu Desk

February 23, 2023 | 09:24 AM

Viveka Murder: వివేకాను చంపించింది ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటీషన్

Viveka Murder: సీఎం జగన్ బాబాయ్, దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. వైఎస్‌ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డే చంపించారు. దీనిని నిరూపించేందుకు మా వద్ద ప్రాసంగిక సాక్ష్యాలన్నీ ఉన్నాయని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అనేక సంచలన సంగతులు బయటపెట్టింది.

ఇంకా చెప్పాలంటే ఈ హత్య గురించి ఇప్పటివరకు తన దర్యాప్తులో తేలిన విషయాలను సీబీఐ పూసగుచ్చినట్లుగా కోర్టుకు ఇందులో వివరించింది. హత్యకై 40 కోట్లతో డీల్ కుదిరిందని.. ఇందులో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది. వైఎస్ వివేకానందరెడ్డి ఎంపీ సీటుకు అడ్డొస్తున్నారనే కారణంతోనే అడ్డుతొలగించుకోవాలని అవినాష్ నిర్ణయించుకున్నారని సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది.

అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్లాన్‌ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలిందన్నారు. ఆ సమయంలో వివేకాతో విభేదిస్తున్నవారంతా ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. దీనికోసం వివేకాతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ఆయనపై కోపం పెంచుకున్న ఎర్ర గంగిరెడ్డి (ఏ1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (ఏ2), డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి (ఏ4 – అప్రూవర్‌), ఉమాశంకర్‌రెడ్డిలను పోగేశారని.. ఈ నలుగురే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారని వెల్లడించింది.

అంతేకాదు, వివేకా హత్య జరిగిన రోజు ఉదయం పలువురు నిందితులు అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఇతర నిందితులకు ఇచ్చిన భరోసా మేరకు.. వివేకా ఇంటికి వెళ్లి సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు రెడీగా కూర్చొని ఉండగా.. వివేకా పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి నుంచి ఫోన్‌ రాగానే అక్కడికి వెళ్లి.. రక్తపు మడుగును శుభ్రం చేయడం, గుండెపోటు కథను ప్రచారం చేయడం, వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజీతో కవర్‌ చేయడం వంటివన్నీ చేశారని సీబీఐ తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ పెంచాయి.