Manthralayam: మంత్రాలయ గురు రాఘవేంద్రుల వైభవోత్సవాలు ప్రారంభం… ఆరు రోజుల పాటు నిర్వహణ

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 08:24 PM

Manthralayam: మంత్రాలయ గురు రాఘవేంద్రుల వైభవోత్సవాలు ప్రారంభం… ఆరు రోజుల పాటు నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నేటి నుంచి గురుభక్తి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూల బృందావనానికి పంచామృతం అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు.

402 వ పట్టాభిషేకం సందర్భంగా మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు స్వామి వారిని పాదుకలకు నవరత్నాలు, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ రోజు (22 వ తేదీన) శ్రీ రాఘవేంద్రస్వామి 402 వ పట్టాభిషకోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గురుభక్తి ఉత్సవాల్లో భాగంగా ఆఖరు రోజైన 26 వ తేదీన శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ జన్మదినంలో భాగంగా టీటీడీ నుంచి అధికారికంగా రాఘవేంద్ర స్వామికి పట్టువస్త్రాలను  సమర్పించనున్నారు. ఈరోజు స్వామివారి ప్రతిమను స్వర్ణ రథోత్సవంలో ఊరేగించనున్నారు. గురు ఉత్సవాల కోసం మంత్రాలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు  తరలి వస్తున్నారు.

రాఘవేంద్ర స్వామి వారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు.