Chardham Yatra: ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర… రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి అంటే…!

శివరాత్రి సందర్భంగా చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. శీతాకాలం కావడం, మంచుకురుస్తుండటంతో ఆరు నెలల పాటు కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. ఈ ఏప్రిల్ 22వ తేదీ నుంచి తిరిగి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఛార్ధామ్ యాత్రకు సంబంధించిన 4 ఆలయ క్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్లోనే ఉన్న నేపథ్యంలో.. యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ లో వెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుకింగ్లను స్వీకరించడం మొదలుపెట్టింది. IRCTC వెబ్సైట్లో బుకింగ్స్ చేసుకోవచ్చు.
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈ ఏడాది ఏప్రిల్ 27న తెరచుకుంటాయి. నవంబర్ 21న తాత్కాలికంగా ఆలయ తలుపులను మూసివేస్తారు. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది ఏప్రిల్ 25న తెరచుకుంటాయి. అలాగే నవంబర్ 14న అంటే వచ్చే భాయీ దూజ్ రోజు ఆలయ ద్వారాలు ముసివేస్తారు. యమునోత్రి ఆలయ ద్వారాలు ఏప్రిల్ 2న తెరచుకుంటాయి. ఇక నవంబర్ 14న ఆలయ తలుపులు మూసుకుంటాయి. గంగోత్రి ఆలయ తలుపులు ఏప్రిల్ 22న తెరచుకుంటాయి. నంవబర్ 13వ తేదీ అంటే దీపావళి రోజున గంగోత్రి ఆలయ తలుపులు మూసుకుంటాయి.