Khammam: రైతులు, కమిషన్ దారుల మధ్య ఘర్షణ.. రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 11:16 AM

Khammam: రైతులు, కమిషన్ దారుల మధ్య ఘర్షణ.. రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్!

Khammam: మిర్చి రైతులు, మార్కెట్ లో కమిషన్ వ్యాపారం చేసే వ్యాపార దారుల మధ్య ఘర్షణ చెలరేగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. కమిషన్ దారు ఓ రైతుపై చేయిచేసుకోవడంతో మొదలైన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘర్షణలో పలువురు రైతులకు గాయాలవగా.. కమిషన్ దారులకు కొందరికి ఒంటి మీద బట్టలు కూడా చిరిగిపోయాయి.

మార్కెట్ కు మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతును ఒక కమిషన్‌ దారు అడ్డుకోగా.. రైతులు మా పొట్ట కొట్టకండని వేడుకున్నా వినలేదు. మిర్చి అమ్మకం ఆపివేయాలని కమిషన్ దారు కోరారు. దీంతో రైతు కుటుంబం ఆ కమిషన్ దారుడిపై దాడికి పాల్పడ్డారు. రైతులపై కమిషన్‌ దారులు కూడా దాడికి పాల్పడ్డారు. మొత్తంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ రణరంగంగా మారింది. రైతుల ఆగ్రహం కట్టెలు తెంచుకోవడంతో కమిషన్ దారులపై బట్టలు చిరిగేలా తిరగబడ్డారు.

ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన రైతులు కొందరు మార్కెట్ కి మిర్చి బస్తాలను తీసుకొచ్చి ఒక కమిషన్ దారుకు అమ్ముకున్నారు. అయితే ఆ రైతులలో వడ్డే వెంకటేశ్వర్లు అనే రైతు మరో కమిషన్ దారు దగ్గర అంతకు ముందు పంట వేసేప్పుడు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పంటను తనకు అమ్మకుండా మరొకరికి అమ్మడంపై వివాదం మొదలైంది. అయితే.. అప్పు ఇచ్చిన కమిషన్ దారు కంటే మరో వ్యక్తి అదనంగా పంటకి ధర చెల్లించడంతోనే అమ్ముకుని మీ డబ్బు వడ్డీతో సహా ఇస్తున్నామని రైతులు వాదనకి దిగారు.

ఈ నేపథ్యంలో రైతులకి కమిషన్ దారులకు మధ్య ఘర్షణ జరగటం.. కమిషన్ దారు రైతు వడ్డే వెంకటేశ్వర్లుపై దాడి చేయడం జరిగిపోయింది. అనంతరం రైతులు కమిషన్ దారులపై కూడా దాడి చేశారు. దీంతో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో మార్కెట్ కమిటీ కూడా రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క మార్కెట్ లో కొనుగోలు ఆపేయాలని కమిషన్ దారులు ప్రయత్నాలు చేస్తున్నారు.