Hyderabad: దారుణం.. కారుతో గుద్దితే పల్టీలు కొట్టుకుంటూ 20 మీటర్ల దూరంలో పడ్డ వ్యక్తి!

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 11:08 PM

Hyderabad: దారుణం.. కారుతో గుద్దితే పల్టీలు కొట్టుకుంటూ 20 మీటర్ల దూరంలో పడ్డ వ్యక్తి!

Hyderabad: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు తన కీయా కారులో అతివేగంగా వెళ్తుండగా ఫిట్స్‌ వచ్చి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఇరువైపులా ఆపి ఉన్న రెండు కార్లు, తొమ్మిది బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ నాగోల్ లో మరో కారు భీభత్సం సృష్టించింది.

కారుతో ఓ వ్యక్తిని గుద్దితే అతను పల్టీలు కొట్టుకుంటూ ఏకంగా 20 మీటర్ల దూరంలో పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోల్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వచ్చిన కారు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. కారు గుద్దిన వేగానికి అతను 20 మీటర్ల దూరం వరకు పల్టీలు కొడుతూ వెళ్లి 20 మీటర్ల అవతల పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేశారు.

ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. బాధితుడు కుషాయిగూడకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. అతను రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ సెల్ ఫోన్ వైపు చూసుకుంటూ నాగోల్ వైపు వెళ్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు తనను గుద్దేసింది. అంతే గాల్లోకి ఎగిరి 20 మీటర్ల దూరం పల్టీలు కొట్టుకుంటూ కిందపడ్డాడు.

ఈ వ్యక్తిని ఢీ కొట్టడానికి ముందే.. మరో మహిళను కూడా ఈ కారు ఢీకొట్టిందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు గానీ, సమాచారం గానీ తమకు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. కానీ, గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.