Tamil Nadu: ఘోర అగ్ని ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో 8 మంది సజీవ దహనం!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 03:43 PM

Tamil Nadu: ఘోర అగ్ని ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో 8 మంది సజీవ దహనం!

Tamil Nadu: ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. త‌మిళ‌నాడులోని కాంచీపురంలో ఈ ఘోరం జ‌రిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణ‌సంచా ప‌రిశ్ర‌మ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్ట‌రీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ప‌లువురు కార్మికులు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

కురువిమలై వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ అనే పేరుతో బాణసంచా తయారీ ప్లాంట్ పనిచేస్తోంది. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్లాంట్‌లో 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రమాద బాధితులను ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను ఫైరింజ‌న్ల స‌హాయంతో అదుపు చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.