Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

Kaburulu

Kaburulu Desk

March 17, 2023 | 09:11 AM

Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!

Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్యారడైజ్‌ సమీపంలోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో మొత్తం 8 అంతస్తులున్నాయి. తొలుత ఏడో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగగా.. 5వ అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి.

ఆ తర్వాత 4వ అంతస్తు వరకు మంటలు వ్యాపించగా.. 5వ అంతస్తులో వస్త్ర దుకాణాలు, కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్‌ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం సంభవించగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బందితోపాటు, షాపింగ్‌కు వచ్చిన వారు వెంటనే కిందికి దిగిపోయారు. అయితే పెయింటింగ్ డబ్బాలు పేలడం, అగ్నికీలలు భారీగా ఎగసిపడటం, పొగ కమ్ముకోవడంతో కొందరు కిందికి రాలేకపోయారు.

ఆ భవనంలో ఉన్న కాల్ సెంటర్ లో పని చేస్తున్న నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ప్రమాదంలో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. చివరికి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ గురువారం అర్ధరాత్రికి కానీ ముగిసింది. అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదంతో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో సెల్‌ఫోన్ల లైట్లను కిందికి చూపిస్తూ కాపాడాలంటూ బాధితులు చాలాసేపు వేడుకున్నారు. గదిలోని వారికి ఆక్సిజన్‌ అందక అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు హైడ్రాలిక్‌ క్రేన్ల సాయంతో కొందరిని రక్షించారు. ఎక్కువ మంది షాపుల వెనుక భాగంలోని బాత్‌రూం విండోల నుంచి తప్పించుకొని బయటపడగా.. వారిని రెస్క్యూ సిబ్బంది సేఫ్ గా కిందకి పంపారు.

అయితే, గదిలో చిక్కుకున్న ఆరుగురిలో ఇద్దరు సురక్షితంగా ఉండగా.. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. భవనం కింది అంతస్తులోని ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగి వైర్ల ద్వారా అవి ఎనిమిదో అంతస్తులోకి చేరి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, మృతులను కాల్ సెంటర్ ఉద్యోగులు త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు.