Governor Tamilisai: గవర్నర్ తమిళిసైపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 09:20 PM

Governor Tamilisai: గవర్నర్ తమిళిసైపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్

Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం.. గవర్నర్ తమిళిసై మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ పరస్పర ఆరోపణలు పతాక స్థాయికి చేరగా వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది.

అయితే, అప్పుడు ఇరు పక్షాలు కాస్త వెనక్కి తగ్గగా గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు మొదలై ముగిసాయి. కానీ, ఈ సమావేశాల్లో సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులను మాత్రం గవర్నర్ ఆమోదించలేదు. దీంతో గవర్నర్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంలో రిట్ పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. కాగా, ఏకంగా గవర్నర్ పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

కాగా, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే.. యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు కామన్ బోర్డు ఏర్పాటు, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టసవరణ, జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, ములుగులో ఫారెస్ట్ పరిశోధన సంస్థ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం వంటి బిల్లులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి రేపు సుప్రీంలో విచారణ ఎలా ఉండనుందో చూడాలి.