Rangareddy District: చెల్లి పెళ్లి శుభలేఖలు పంచుతూ యాక్సిడెంట్.. పెళ్లి రోజే మృతి చెందిన అన్న!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 09:40 PM

Rangareddy District: చెల్లి పెళ్లి శుభలేఖలు పంచుతూ యాక్సిడెంట్.. పెళ్లి రోజే మృతి చెందిన అన్న!

Rangareddy District: చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ అన్న. చెల్లిని జీవితాంతం మంచిగా చూసుకొనే భర్త కావాలని కోరుకున్నాడు. అనుకున్నట్లే ఎంతో వెతికి చివరికి పెళ్ళికి సంబంధం కుదిర్చాడు. ఆర్మీలో ఉన్న అన్న చెల్లి కోసం ఇంటికి వచ్చి పెళ్లి పనులలో నిమగ్నమయ్యాడు. ఏ లోటు లేకుండా చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆరాటపడ్డాడు. బంధు మిత్రులకి, స్నేహితులను స్వయంగా ఆహ్వానించాలని వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్న సరిగ్గా చెల్లి పెళ్లి రోజే మృతిచెందాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కంసాన్ పల్లికి చెందిన ఇప్పటూరు సత్యమ్మ-సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్ గా జమ్మూ కాశ్మీర్‎లో విధులు నిర్వహిస్తున్నారు. తన చెల్లికి పరిగికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించి.. మార్చి 1న ముహర్తం పెట్టారు.

పెళ్లి కోసం గ్రామానికి వచ్చిన శ్రీనివాస్.. బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే సమయంలో ఫిబ్రవరి నెల 21న మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. అయితే చెల్లెలు పెళ్లి జరిగిన రోజునే అన్న కన్ను మూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రమాదానికి గురైన అన్న శ్రీనివాస్ ఆస్పత్రిలో ఉండగానే చెల్లెలు శిరీష వివాహాన్ని.. పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికి వరుడు స్వగ్రామంలో నిరాడంబరంగా జరిపించారు. పెళ్లి అనంతరం శ్రీనివాస్ మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతదేహానికి ఆర్మీ అధికారులు పాల్గొని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటనతో సమీప గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.