Yadagirigutta Brahmothsavalu: యాదగిరి గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల విశిష్టత ఎంటో తెలుసా…?

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏం కావాలో కోరుకో” అంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవ వేడుకల్లో తొలి అధ్యాయం.. విష్వక్సేన ఆరాధన. ఇతను విష్ణు గణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. చతుర్భుజుడు. ముమ్మూర్తులా విష్ణువులా ఉంటాడు. కశ్యపుడు పెంచి పెద్దచేశాడని చెబుతారు. వేదాలు ఆపోశన పట్టాడు. మంత్రశాస్త్ర పారంగతుడు. విష్వక్సేన ఆరాధనకు వైష్ణవంలో అపార ప్రాధాన్యం ఉంది. విష్వక్సేనుడిని కొలిస్తే సమస్త విఘ్నాలూ తొలగిపోయి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని పాంచరాత్రాగమ శాస్త్రం సూచిస్తున్నది.
యుగాలనాటి లక్ష్మీనరసింహ క్షేత్రం.. యాదగిరిగుట్ట. ఆ ఆలయ చరిత్రలో ఎన్నో మలుపులు. అనేక పూజా విధానాలు. మూడు వందలఏండ్ల క్రితం.. వానమామలై జీయర్ స్వామి పాంచరాత్రాగమం ప్రకారం.. రామానుజ సంప్రదాయాన్ని స్థిరపరిచారు. నాటినుంచీ నిత్యోత్సవాలు మొదలు బ్రహ్మోత్సవాల వరకు.. పూజాదికాలన్నీ అదే పద్ధతిలో నడుస్తున్నాయి. అర్చకుల మంత్రోచ్చారణ, పండితుల వేద పారాయణ, రుత్వికుల ప్రబంధ పాఠాల నడుమ… ఫాల్గుణ మిత్రుడైన స్వామికి ఏటా ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయమూ అప్పుడే మొదలై ఉండవచ్చు.