Bihar: బీహార్ దొంగలంటే మహా ముదుర్లు.. ఏకంగా రెండు కిమీ రైల్వే ట్రాక్ నే లేపేశారు!

Bihar: బీహార్ లో దొంగల గురించి.. అక్కడ దొంగతనాల గురించి వినే ఉంటారు. మన తెలుగు సినిమాలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. బీహార్ రాష్ట్రంలో బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి గ్రామంలో రక్షక్ దళ్ పేరిట యువకుల గ్రూప్స్ కూడా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ ఇక్కడ దొంగతనాలు, నేరాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఇక్కడ దొంగలు ఎంత ముదుర్లంటే ఏకంగా రెండు కిమీ దూరం రైల్వేట్రాక్ ను కూడా లేపేశారంటే అర్ధం చేసుకోవచ్చు.
కొంతకాలంగా మూతపడ్డ రైల్వే ట్రాక్ చోరీకి గురైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అక్కడ ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేశారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు స్పందించారు. కాపలాగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చేతివాటం వలనే ఇది సాధ్యమైందని గ్రహించి.. అక్కడి సిబ్బందిలో ఇద్దరిపై అప్పటికప్పుడు వేటు వేశారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించి, నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లో ఇండియన్ రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది. కొంతకాలం పాటు ఈ మిల్ నుండి రవాణా కూడా కొనసాగింది. అయితే, ఈ మిల్ మూతపడడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం లేదు.
ఇలా నిరుపయోగంగా మారిన ట్రాక్ ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద అమ్మేయాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో టెండర్లు లేవు.. బిడ్డింగ్ లేదు.. కానీ ట్రాక్ మాత్రం మాయమైంది. ఓ దొంగల ముఠా స్థానిక ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను లేపేసి తుక్కు కింద అమ్మేసి సొమ్ము చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ట్రాక్ చోరీకి గురైందన్న సమాచారం తెలిసి రైల్వే ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. బాధ్యులలో ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేశారు.