Murder For I Phone: ఐఫోన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్.. కట్టేందుకు డబ్బుల్లేక డెలివరీ బాయ్ హత్య!

Murder For I Phone: యూత్ లో ఐ ఫోన్ కోసం ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు, ఐ ఫోన్ కోసం దొంగతనాలు చేసిన వాళ్ళు, ఐ ఫోన్ కోసం గొడవపడి ఇంటి నుండి పరారైన వాళ్ళు, తల్లిదండ్రులపై హత్యాయత్నం చేసిన వాళ్ళని చూశాం. కాగా, ఇప్పుడు ఓ యువకుడు ఐ ఫోన్ కోసం ఏకంగా డెలివరీ బాయ్ నే హత్య చేసి.. నాలుగు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ ప్రాణాలు తీశాడో యువకుడు. ఈ ఘటన ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా అనే 20 ఏళ్ల యువకుడు ఆన్లైన్లో ఐఫోన్ను రూ.46వేలకు బుక్ చేసుకుని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన ఇ-కార్ట్ ఎక్స్ప్రెస్ డెలివరీ బాయ్ హేమంత్ నాయక్.. ఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. రూ.46వేలు చెల్లించి ఫోన్ తీసుకోవాలని డెలివరీ బాయ్ కోరగా.. కస్టమర్ హేమంత్ వద్ద డబ్బు లేకపోవడంతో డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నాలుగు రోజులు
ఇంట్లోనే ఉంచాడు. మృతదేహం వాసన రావడంతో ఓ సంచిలో చుట్టి బైక్పై రైల్వే స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దహనం చేశాడు.
కాగా, రోజులు గడుస్తున్నా డెలివరీ బాయ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు హేమంత్ను గుర్తించి అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్ మృతదేహాన్ని నిందితుడు బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలను పోలీసులు రిలీజ్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Caught On CCTV, Man With Body Of Delivery Agent He Had Killed Over iPhone https://t.co/Dfvu7TBnFr pic.twitter.com/tsfnvis2yR
— NDTV (@ndtv) February 20, 2023