Karnataka Elections 2023: మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ!

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 12:55 PM

Karnataka Elections 2023: మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ!

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే.. మే 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌, మే 10న పోలింగ్‌.. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు చెప్పారు. మొత్తం 25,282 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బీజేపీకి 119 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి.

మొత్తం 5.22 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 2.62 కోట్ల మంది పురుషులు, 2.59 కోట్ల మంది మహిళలు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 9.17 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కాగా, 80 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ప్రారంభించడం కమిషన్ మంచి నిర్ణయం అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 58,282 పోలింగ్ బూత్‌లు, థర్డ్ జెండర్ల కోసం ప్రత్యేక బూత్‌లు, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక బూత్‌లు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం పంచకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 2,400 సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 171 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. కాగా, అధికార బీజేపీ ఇక్కడ 150 స్థానాల గెలుపు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 124 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా, 93 స్థానాలకు జేడీఎస్ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఏప్రిల్ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించనుంది.